🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 17 Aug, 2026 | Page: 1

రేవంత్ రెడ్డి.. ఆడబిడ్డలతో ఆటలా..? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్

హనుమకొండ, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో ధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తూ అర్హులైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల నిధులను వెంటనే విడుదల చేయడంతో పాటు, పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసి పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home