🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 07 Sep, 2026 | Page: 1

బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసన

హనుమకొండ: బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు హనుమకొండ చౌరస్తాలో మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరఫున తమ వాణిని వినిపించాల్సిన ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించే ప్రజాస్వామ్య వేదిక అని, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కూడా తమ నియోజకవర్గాలు, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించే పూర్తి హక్కు ఉందని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలిచే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు దూరంగా ఉంచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ, ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అడ్డుకునే చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు సభలో తమ వాణిని వినిపించే అవకాశం కల్పించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.రాస్తారోకో సందర్భంగా హనుమకొండ చౌరస్తాలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు ఆందోళనలో పాల్గొన్న దాస్యం వినయ్ భాస్కర్ గారితో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు,మాజీ కార్పొరేటర్లు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
🏠 Home