🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 08 Sep, 2026 | Page: 1

కొడవటూరు గ్రామంలో కుర్మకులస్తుల మధ్య గొర్రెలు, మేకల షెడ్ల వివాదంపై ముందస్తు చర్యలు

కొడవటూరు గ్రామంలో కుర్మకులస్తులకు చెందిన రెండు వర్గాల మధ్య ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్న గొర్రెలు, మేకల షెడ్ల విషయమై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఇరువర్గాల మధ్య ఈ వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో, భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బచ్చన్నపేట పోలీసులు ఇరువర్గాలకు చెందిన మొత్తం 87 మందిని స్థానిక ఎంఆర్ఓ గారి సమక్షంలో బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇరువర్గాలను పోలీసులు హెచ్చరించారు.

బచ్చన్నపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ప్రజలు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, వివాదాలను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించవద్దని పోలీసులు సూచించారు.

మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని బచ్చన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.
🏠 Home