🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 10 Sep, 2026 | Page: 1

ఎల్‌నినో వేళ.. ప్రత్యామ్నాయ పంటలే మేలు

*జన చరిత్ర న్యూస్ నెక్కొండ , సెప్టెంబర్ 10 ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల సాగులో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో ఉద్యాన, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఉద్యాన పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై శిక్షణా-అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త బి.వి. రాజ్‌కుమార్ , మండల వ్యవసాయ అధికారి ఎ. నాగరాజు , ఉద్యానవన అధికారి తరుణ్ , సర్పంచ్ రజిత , పీఏసీఎస్ చైర్మన్ , రైతులు పాల్గొన్నారు.

శాస్త్రవేత్త రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల్లో పత్తి, వరి పంటల్లో చీడపీడలు, తెగుళ్లను సమగ్ర యాజమాన్య పద్ధతులతో నియంత్రించుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారి ఎ. నాగరాజు మాట్లాడుతూ నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఉద్యానవన అధికారి తరుణ్ మాట్లాడుతూ కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ సాగుకు ఉద్యాన శాఖ అందిస్తున్న వివిధ రాయితీలు, పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు విధానం, నీటి యాజమాన్యం, తోట నిర్వహణ, ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

సర్పంచ్ రజిత రైతులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరగా, పీఏసీఎస్ చైర్మన్ యూరియా సరఫరా నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, యూరియా బుకింగ్ కోసం సంబంధిత యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
🏠 Home