🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

అనుమతులు లేకుండా నిల్వ చేసిన టపాసులు స్వాధీనం

హసన్‌పర్తి: అనుమతులు లేకుండా భారీగా టపాసులను నిల్వ చేసిన వ్యక్తిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూరి కిషోర్‌ (52) ఇంటితో పాటు ఆయన జనరల్ స్టోర్‌పై దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఇంట్లో నిల్వ ఉంచిన వివిధ రకాల టపాసులు, అలాగే దుకాణంలో నిల్వ చేసిన క్రాకర్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో లభించిన టపాసుల విలువ రూ.2,21,130, దుకాణంలో లభించిన టపాసుల విలువ రూ.2,07,115గా పోలీసులు తెలిపారు.
మొత్తంగా రూ.4,28,245 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులను నిల్వ ఉంచినట్లు గుర్తించిన పోలీసులు, నిందితుడు కట్కూరి కిషోర్‌, తండ్రి భాస్కర్‌, వయస్సు 52 సంవత్సరాలు, హసన్‌పర్తి నివాసిగా గుర్తించారు.
దాడి అనంతరం స్వాధీనం చేసుకున్న టపాసులతో పాటు నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై హసన్‌పర్తి పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.
ఈ దాడిలో ఏసీపీ ఏ. మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్‌ జి. సుబ్బారెడ్డి, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్‌ మరియు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home