🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Sep, 2026 | Page: 1

ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీపీ వార్షిక తనిఖీ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..వాహనదారులు,పాదచారుల భద్రతకు ప్రాధాన్యం

*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 11*
వరంగల్‌: వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత,ఐపీఎస్‌ శుక్రవారం వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు.స్టేషన్‌కు చేరుకున్న సీపీకి ఇన్‌స్పెక్టర్‌ మొక్క అందజేసి స్వాగతం పలికారు.అనంతరం సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని కిట్‌ ఆర్టికల్స్‌, వివిధ రికార్డులను సీపీ పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడి శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ట్రాఫిక్‌ పోలీసుల విధుల నిర్వహణ,వాహనాల తనిఖీలు,ట్రాఫిక్‌ నిబంధనల అమలు,రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ,రోడ్డు ప్రమాదాల నివారణ,వాహనదారులు,పాదచారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ శ్వేత సూచించారు.ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి,అక్కడ అవసరమైన ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు,నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన సేవలు అందించాలని సీపీ పేర్కొన్నారు.స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ,సిబ్బంది పనితీరు,విధుల కేటాయింపు తదితర అంశాలను పరిశీలించారు.ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌ సేవలు అందించేందుకు సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.తనిఖీలో ట్రాఫిక్‌ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు,ఏసీపీ సత్యనారాయణ, సీఐ కే.సుజాత,ఎస్‌ఐలు,ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home