🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Sep, 2026 | Page: 1

భద్రకాళి బండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి గ్రీనరీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి – హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, సెప్టెంబర్ 12: భద్రకాళి బండ్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.
శనివారం భద్రకాళి బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన గ్రానైట్ పనులు, పాత్‌వేలు, లైటింగ్, డ్రైనేజీ, గ్రీనరీ తదితర పనుల నాణ్యతను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బండ్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. పచ్చదనాన్ని పెంచడంతో పాటు గ్రీనరీని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చేపట్టిన అన్ని పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని, పనుల్లో నాణ్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని చాహత్ బాజ్ పాయి స్పష్టం చేశారు. మిగిలిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ రవి కుమార్, డీఈలు, ఏఈలు, హార్టికల్చర్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home