EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎన్నికల హామీల మేరకు తులం బంగారం ఇవ్వాలి: గండ్ర వెంకటరమణారెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 02:02 PM | Politics, TELANGANA, వరంగల్, హన్మకొండ
    ఎన్నికల హామీల మేరకు తులం బంగారం ఇవ్వాలి: గండ్ర వెంకటరమణారెడ్డి

    కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా అమలు చేయాలి
    హామీలు అమలు చేయకుండా మాటలతో తప్పించుకోలేరు
    రిపోర్టర్‌పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆందోళన

    భూపాలపల్లి, ఆగస్టు 17, 2026:
    కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు.
    కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. రిపోర్టర్‌పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
    ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి పదేళ్లపాటు అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కోర్టుల్లో సరైన వాదనలు వినిపించకపోవడంతో పథకంపై ఆంక్షలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించాలని డిమాండ్‌ చేశారు.
    అలాగే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం, రైతు బీమా తదితర హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమయం కేటాయించకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని గండ్ర సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటాన్ని గుర్తించాలని అన్నారు.
    రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులకు సాగునీరు, ఎరువులు అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలతో, ఎదురుదాడులతో తప్పించుకోలేరని గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా పాలన సాగిస్తూ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు.