EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో పనిచేస్తోంది: చల్లా ధర్మారెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 17 Aug 2026, 05:45 PM | TELANGANA, వరంగల్
    రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో పనిచేస్తోంది: చల్లా ధర్మారెడ్డి

    వరంగల్: హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
    పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభతో ప్రజలకు ఒరిగిందేమిటని చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి మాట్లాడలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తామే చేసినట్లు చెప్పుకుంటోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
    రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచలేని అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిందని అన్నారు. పరకాల ఎమ్మెల్యే పేరును సీఎం రేవంత్‌రెడ్డి మర్చిపోయి మరో పేరు ప్రస్తావించారని, అలాంటి పరిస్థితుల్లో పరకాల ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
    పరకాలలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, దామెర చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయడంపై ఎమ్మెల్యేకు శ్రద్ధ లేదని ధర్మారెడ్డి ఆరోపించారు. సీఎం పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించి వారిని రోడ్డున పడేశారని, వారి కోసం నిర్మిస్తున్న కాంప్లెక్స్‌ను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. గత మూడేళ్లలో పరకాల ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
    అధికార బలంతో ఏది మాట్లాడినా చెల్లుతుందని ప్రభుత్వం భావించవద్దని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు. త్వరలోనే ప్రజలు ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని అన్నారు.
    రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై వినయ్ భాస్కర్ ఆగ్రహం
    మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు సిగ్గుచేటని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. చేయని పనులకు రంగులు వేసుకుని అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
    తెలంగాణలో అన్ని వర్గాలను కుటుంబంగా భావించి కేసీఆర్ అభివృద్ధి చేశారని, సామాజిక న్యాయానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారని వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా దళిత బిడ్డ రాజయ్యకు, తొలి స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించడంతో పాటు అనేక మందికి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు.
    రేవంత్‌రెడ్డి పాలనలో ఎక్కడా సామాజిక న్యాయం కనిపించడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
    ఓఆర్‌ఆర్ విషయంలో గతంలో రైతులను రెచ్చగొట్టి అడ్డుకున్నవారే ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ను తామే తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారని వినయ్ భాస్కర్ ఆరోపించారు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు తాము స్పందించకుండా ఉండటం మాటలు రాక కాదని, చిల్లర వ్యాఖ్యలకు సమాధానం చెప్పకూడదనే ఉద్దేశంతోనే మౌనం పాటిస్తున్నామని తెలిపారు.