EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాఖాల సరస్సు నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతి

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Aug 2026, 05:08 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    పాఖాల సరస్సు నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతి

    హైదరాబాద్: నర్సంపేట నియోజకవర్గంలోని పాఖాల సరస్సు నుంచి ఆయకట్టు రైతులకు కాలువల ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
    ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగునీటి వనరుల్లో నీటిని నిల్వ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, పాఖాల ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పటికే సుమారు 9 వేల ఎకరాలకు పైగా వరి నాట్లు వేసినట్లు ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పంటలకు అవసరమైన నీరు అందకపోతే నాట్లు ఎండిపోయే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వివరించారు.
    పాఖాల సరస్సులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని కాలువల ద్వారా ఆయకట్టు ప్రాంతాలకు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతుల పరిస్థితిని, సాగు విస్తీర్ణాన్ని, పంటలకు ఉన్న నీటి అవసరాన్ని పూర్తి వివరాలతో మంత్రికి వివరించారు.
    ఎమ్మెల్యే వినతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాఖాల సరస్సు నుంచి సాగునీరు విడుదల చేసేలా నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శికి వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
    మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలకు ఆదేశాలు ఇవ్వడంతో పాఖాల ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. సాగునీరు అందుబాటులోకి వస్తే వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.