EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కల్లెడ చదరంగం పోటీలు–2026 ఘనంగా నిర్వహణ *220 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం – ₹72,000 నగదు బహుమతులు

    Author
    Posted By JANA CHARITRA
    | 23 Aug 2026, 07:48 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    కల్లెడ చదరంగం పోటీలు–2026 ఘనంగా నిర్వహణ  *220 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం – ₹72,000 నగదు బహుమతులు

    *జన చరిత్ర పర్వతగిరి , ఆగష్టు 23:

    కల్లెడ చెస్‌ నెట్‌వర్క్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ (RDF) సంయుక్త ఆధ్వర్యంలో కల్లెడలోని వనిత అచ్యుతపాయి జూనియర్‌ కళాశాలలో కల్లెడ చదరంగం పోటీలు–2026 ఆదివారం ఆర్ డి ఎఫ్ వ్యవస్థాపకులు కల్లెడ రామ్మోహన్‌రావు ఘనంగా నిర్వహించారు.

    వరంగల్‌ జిల్లాలోని 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 220 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పోటీలు ఆరు రౌండ్ల పాటు హోరాహోరీగా సాగాయి. విద్యార్థులు తమ వ్యూహాత్మక ఆలోచనా శక్తిని, ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీలను ఆసక్తికరంగా కొనసాగించారు.

    చదరంగం కేవలం వినోదాన్నిచ్చే ఆట మాత్రమే కాకుండా, ఓపిక, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం వంటి జీవన నైపుణ్యాలను పెంపొందించే మేధో క్రీడ అని నిర్వాహకులు పేర్కొన్నారు. చదరంగంలో సాధన చేయడం ద్వారా విద్యార్థుల్లో 360 డిగ్రీల కోణంలో ఆలోచించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని, ఇది వారి విద్యాభ్యాసానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

    గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో చదరంగంపై ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్ డి ఎఫ్ వ్యవస్థాపకులు కల్లెడ రామ్మోహన్‌రావు విజేతలకు మొత్తం ₹72,000 నగదు బహుమతులు అందించారు. అంతేకాకుండా క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు భోజనం, స్నాక్స్‌, అరటిపండ్లు, పండ్ల రసాలతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

    ఇవి కూడా చదవండి

    ఈ పోటీల్లో ఇద్దరు దృష్టి లోపం ఉన్న బాలురు జీవన్‌, చరణ్‌, ఒక వినికిడి–మాట్లాడే లోపం ఉన్న బాలిక కేతన పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక చెస్‌ బోర్డులు, గుత్తులతో వారు పోటీల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

    చెస్‌ నెట్‌వర్క్‌ అధ్యక్షులు సంజయ్‌, జనరల్‌ సెక్రటరీ హరితో పాటు ప్రతినిధులు రాజన్న, ఐతా శ్రీనివాస్‌, గంప అశోక్‌ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వనిత అచ్యుతపాయి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జనార్దన్‌, పీఈటీలు, పీడీలు పోటీల నిర్వహణలో చురుకుగా పాల్గొని క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించారు.

    పోటీల ముగింపు కార్యక్రమానికి డాక్టర్‌ పొన్నాల రామయ్య (రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌, నీటిపారుదల శాఖ), డాక్టర్‌ సోమన్న (ఫిజికల్‌ డైరెక్టర్‌) ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులను అభినందిస్తూ చదరంగాన్ని నిరంతరం సాధన చేయాలని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

    క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం కల్లెడలో ఇలాంటి చదరంగం పోటీలను నిర్వహించాలని వారు నిర్వాహకులను కోరారు.

    విద్యార్థులు, యువతలో చదరంగంపై ఆసక్తిని పెంచి చెస్‌ కల్చర్‌ను అభివృద్ధి చేయడం చెస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యం కాగా, గ్రామీణ విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం ఆర్ డి ఎఫ్ లక్ష్యం. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీని పలువురు విద్యాభిమానులు, పెద్దలు, తల్లిదండ్రులు అభినందించారు.

    ఇలాంటి పోటీలను తరచుగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, ఆత్మవిశ్వాసం, మేధో సామర్థ్యం మరింత పెంపొందుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.
    చీఫ్‌ ఆర్బిటర్‌ గా రజినీకాంత్‌ వ్యవహరించారు